ఉత్తరప్రదేశ్, బరేలీ జిల్లాలోని ఓ గ్రామంలో భూ వివాదం ముగ్గురు ప్రాణాలను మింగింది. బుధవారం అర్థరాత్రి రెండు గ్రూపులు తుపాకీలతో ఒకరి పై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేయగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇక పోలీసుల సమాచారం ప్రకారం ఫరీదీపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కట్క రామన్ గ్రామ పంచాయతీ గోవింద్ పూర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు సర్దార్ పరమవీర్ సింగ్, మరొకరు దేవేంద్ర సింగ్ గా గుర్తించడం జరిగింది. మూడో మృతుడి గురించి ఇంకా తెలియాల్సి ఉందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. మరో ముగ్గురు వ్యక్తులు కాల్పుల్లో బుల్లెట్ గాయాలతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే గ్రామంలో మరోసారి ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. రాయ్ పూర్ హన్స్ గ్రామ పంచాయతీ మాజీ గ్రామాధికారి సురేష్ సింగ్ నేతృత్వంలోని బృందం మొదట కాల్పులు జరిపిందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. భూమి స్వాధీనం విషయంలో మాజీ ప్రధాన్ కు ముగ్గురు చనిపోయిన వారితో వివాదం ఉందని ఆయన చెప్పారు.
ప్రతీకారంగా రెండో వర్గం కూడా కాల్పులు జరిపిందని ఆయన తెలిపారు. సురేష్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు తగిన బలగాలను రంగంలోకి దించగా, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే అర్థరాత్రి ఒక్కసారిగా తుపాకీల మోత మోగడంతో గ్రామస్తులు నిద్రలోనే ఉలిక్కిపడ్డారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని గ్రామస్తులు చెబుతున్నారు.