సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేటలోని డెక్కన్ మాల్ కూల్చివేత పనులు జాగ్రత్తగా కొనసాగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగుతున్నాయని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ జియఉద్దీన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డెమాలిషన్ పనుల కొరకు మొదట్లో ఎస్ కే మల్లు కు టెండర్ ఇచ్చామని.. అయితే వారి వద్ద సరైన మిషినరీ లేకపోవడంతో ఒప్పందం కాన్సెల్ చేశామన్నారు.
అనంతరం రెహ్మాన్ మాలిక్ ట్రేడింగ్ & డెమోలిషన్ కంపెనీకి కూల్చివేతే పనులు అప్పగించామన్నారు. భవనం లోపలే కూల్చే విధంగా డెమాలిషన్ జరుగుతుందన్నారు. భవనం కూల్చివేత సేఫ్ గా జరిగేవిధంగా చూసుకోవడమే తమ బాధ్యత అని వెల్లడించారు. నాలుగు రోజుల్లో భవనం కూల్చివేత ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. బిల్డింగ్ వ్యర్ధాల తొలగింపు మాత్రం ఓనర్ దే బాధ్యత అని అన్నారు జియఉద్దీన్.
కాగా గురువారం రాత్రి 11 గంటలకు బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభించారు. భారీ క్రేన్ సహాయంతో కూల్చివేత పనులను చేపట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. పక్క బిల్డింగులకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా పనులు చేపట్టారు. బిల్డింగ్ కూల్చివేత సమయంలో గోడల నుండి పొగలు రావడంతో పనులు కొంతసేపు నిలిచిపోయాయి.
తరువాత కూల్చివేత పనులను మళ్లీ మొదలుపెట్టారు. బిల్డింగ్ ను కూల్చివేస్తున్న సందర్భంగా దాదాపు 5 రోజుల పాటు రెండు వైపుల రోడ్డును మూసివేశారు. డెక్కన్ మాల్ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.