ప్రముఖ సినీ గాయని లతా మంగేష్కర్ (92) ఇకలేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. పరిస్థితి విశమించడంతో ఆమె కన్నుమూశారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. లతా మంగేష్కర్కు కరోనా సోకడంతో ఆమెను దాదాపు నెల రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
కరోనాతో పాటు న్యూమోనియా కూడా తోడవడంతో తీవ్రంగా బాధపడుతుండటంతో ఆమెకు ఐసీయూలో వైద్యులు చికిత్స అందించారు. వయసు రీత్యా మరిన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
కాగా.. 2019లోనూ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. కొంతకాలం చికిత్స పొందిన ఆమె కొంత కాలానికి కోలుకున్నారు.
గాన కోకిలగా పేరు పొందిన లతా మంగేష్కర్ కు 2001వ సంవత్సరంలో భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న దక్కింది. ఎన్నో వేల పాటలు పాడిన లతా మంగేష్కర్ ను నైటింగేల్ ఆఫ్ ఇండియాగా కీర్తిస్తుంటారు. దేశ, విదేశలలో ఆమె పాటలెన్నో ఆలపించారు.