ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ కే విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్టలోని స్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకు ముందు ఫిల్మ్నగర్ నుంచి పంజాగుట్ట వరకు అంతిమయాత్ర సాగింది. అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని కళాతపస్వికి తుది వీడ్కోలు పలికారు.
బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అంతకుమందు ఫిల్మ్ చాంబర్ లో విశ్వనాథ్ పార్థీవదేహానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కే విశ్వనాథ్ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతిపట్ల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతోపాటు వివిధ సినీ పరిశ్రమల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కే విశ్వనాథ్ ఎన్నో మరుపురాని సినిమాలతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారని గుర్తు చేసుకున్నారు.