పాక్ సరిహద్దుల నుంచి ఓ చిరుత భారత్లోకి చొరబడటంతో కలకలం రేగింది. జమ్ములోని సాంబా జిల్లాలో చిరుత చొరబడినట్టు అధికారులు తెలిపారు. రామ్గఢ్ సబ్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న ఫెన్సింగ్ను దాటి భారత్ భూభాగంలోకి చిరుత ప్రవేశించిందని చెప్పారు.
ఈ క్రమంలో గ్రామస్తులను బీఎస్ఎఫ్ అధికారులు అప్రమత్తం చేశారు. చిరుత పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో చిరుతకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి.
ఆ వీడియో క్లిప్ను బీఎస్ఎఫ్ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చాలా అరుదైన ‘చొరబాటు’ సంఘటన అని బీఎస్ఎఫ్ పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదగా కామెంట్స్ పెడుతున్నారు.
దేశంలోకి చొరబడిన చిరుతకు కొందరు ఫన్నీగా స్వాగతం పలికారు. భారత్ ఇప్పుడు ఆఫ్రికా దేశాల నుంచి చిరుతలను దిగుమతి చేసుకుంటోందని, అలాంటి సమయంలో ఈ చొరబాట్లను తప్పకుండా స్వాగతించాలంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి చొరబాటును భద్రతా సిబ్బంది అనుమతిస్తారా? అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.