ప్రధాని నరేంద్ర మోడీకి కర్ణాటకలోని హనుమద్ జన్మభూమి ట్రస్టు.. ట్రస్టీ గోవిందానంద సరస్వతి లీగల్ నోటీసు పంపించారు. అదేవిధంగా సంబంధిత కేంద్ర శాఖలు, పలువురు అధికారులకు లేఖలు రాశారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్ గడువు ముగిసినందున తక్షణం ఆయనను కేంద్రంలోని మాతృశాఖకు పంపించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈ నెల 12న లీగల్ నోటీసులు జారీ చేశారు. ధర్మారెడ్డి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ అధికారి అని నోటీసులో పేర్కొన్నారు. ఐడీఈఎస్ ద్వారా రక్షణ శాఖలో జాయింట్ సెక్రటరీ హోదాలో ఉద్యోగం చేస్తున్నారని వివరించారు.
నిబంధనల మేరకు డిప్యుటేషన్పై బదిలీ అయితే గరిష్ఠంగా ఏడేళ్లకు మించి కొనసాగడానికి వీల్లేదని అన్నారు. ధర్మారెడ్డి ఇప్పటికి ఏడేళ్ల గరిష్ఠ వ్యవధిని పూర్తి చేశారని లేఖలో వివరించారు. శనివారంతో ఆయన గడువు ముగిసిందని.. కేంద్రం డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు ఇస్తే తప్ప ఆయన ఇపుడున్న హోదాలో కొనసాగే వీలు లేదని రాసుకొచ్చారు.
దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనను మాతృశాఖకు పంపించాలని నోటీసులో పేర్కొన్నారు. కేంద్ర విభాగాలకు రాసిన లేఖల్లో.. ధర్మారెడ్డి తిరుమల ప్రతిష్ఠ దెబ్బతినేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.