శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమంట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202 టీఎంసీలు గా ఉంది. ప్రాజెక్టుకు 81,853 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 57,751 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
కాగా.. ఎడమ గట్టు, కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు రేడియల్ క్రేస్ట్ గేట్ల ద్వారా మంత్రి అంబటి రాంబాబు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేశారు.
మరోవైపు.. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుల చేస్తుండటంతో శ్రీశైలానికి భారీగా ప్రవాహం వస్తోంది.ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు నదిలోకి రావద్దని సూచించారు.