దేశంలో తొలిసారిగా జమ్మూకాశ్మీర్ లో లిథియం నిల్వలను కనుక్కున్నట్లు కేంద్రప్రభుత్వం గురువారం వెల్లడించింది. లిథియం నాన్ ఫెర్రస్ మెటర్. సెల్ ఫోన్లు,ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీల్లో లిథియం విరివిగా ఉపయోగిస్తారు. జమ్మూకాశ్మీర్ లోని రియాసి జిల్లాల్లోని సలాల్ హైమానా ప్రాంతంలో ఈ నిల్వలు ఉన్నట్లు గనుల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
లిథయంతో పాటు బంగారానికి సంబంధించి 51 మినరల్ బ్లాకులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఇందులో 5 బ్లాక్ లు బంగారానికి సంబంధించినవి కాగా..పొటాష్, మాలిబ్డినం,బేస్ మెటల్స్ మొదలైన ఖనిజాల బ్లాకులు ఉన్నాయి. ఇవి జమ్మూకాశ్మీర్ తో పాటు ఏపీ, ఛత్తీస్ గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక,మధ్య ప్రదేశ్,ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు మొత్తం 11 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆధారంగా 2018- 19 ఫీల్డ్ సీజన్ నుంచి ఈ బ్లాకులను ఏర్పాటు చేసింది.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వ్యూహాత్మక, కీలకమైన ఖనిజాలపై 115 ప్రాజెక్టులు, ఎరువుల ఖనిజాలపై 16 ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. 2023 -24 ఏడాదిలో 12 సముద్ర ఖనిజ పరిశోధన ప్రాజెక్టులతో సహా 318 ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులతో కూడిన 966 కార్యక్రమాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపడుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.