నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుతో కేంద్రహోంశాఖ రంగంలోకి దిగనుంది. తనపై ఏపీలో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, నియోజకవర్గానికి వెళ్తే అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ ఎంపీ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. దీనిపై లోక్సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఈ ఫిర్యాదుపై ఆరా తీయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈ వ్యవహారంపై 15 రోజుల్లో ఫ్యాక్చువల్ నోట్ అందజేయాలని ఆదేశించింది.
లోక్సభ ప్రివిలేజెస్ అండ్ ఎథిక్స్ విభాగం ఆదేశాలను హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యక్తిగత కార్యదర్శి సాకేత్ కుమార్, ఆ శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు, ఏపీ సీఎస్ లకు పంపించారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను సంప్రదించే అవకాశాలు ఉన్నాయి.
ఎంపీపై ఇటీవల నమోదైన కేసులెన్నీ, ఎవరు పెట్టారు వంటి అంశాలను కేంద్ర హోంశాఖ ఆరా తీయనుంది. ఈ నెల 1న లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ రఘరామకృష్ణంరాజు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు.