నారా లోకేష్ యువగళం పాదయాత్రపై తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు మంత్రి రోజా. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. లోకేష్ పాదయాత్ర కాస్త రోజు రోజు జోకేష్ పాదయాత్రలా సాగుతూ జబర్దస్త్ కి పోటీగా నిలబడుతోందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు చివరికి అవకాశం ఇస్తే ఆంధ్ర ప్రజలకు ఇదే చివరి రోజులు అవుతాయంటూ హాట్ కామెంట్లు చేశారు. ఒక పక్క వయోవృద్దుడు.. మరో పక్క అసమర్థుడితో తెలుగు దేశం పార్టీ నలిగి పోతోందని అంటూ చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు గుప్పించారు.
ఇక కర్ణాటకలో ఉన్న డ్యాంల ఎత్తును పెంచి ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రకటించారు రోజా. అమరావతిపై చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఎందుకు శాశ్వత కట్టడాలు నిర్మించలేదు అని నిలదీశారు ఆమె. రాష్ట్రాన్ని విడగొట్టి అప్పుల పాలు చేసిన ఘనత చంద్రబాబుదేనన్న ఆమె పరిపాలన వికేంద్రీకరణ వల్ల వెనుక బడ్డ రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
ఇక రాయలసీమకు న్యాయ రాజధాని రావడం రాయలసీమ బిడ్డగా తనకెంతో గర్వకారణంగా ఉందని వెల్లడించారు ఆమె. కాగా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే లోకేష్ ఎంత ఎక్కువ కాలం పాదయాత్ర చేస్తే.. అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేలు జరుగుతుందని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు.