భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కళ్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. సీతారాముల కళ్యాణం ఎన్నో ఏళ్లుగా ఆరు బయట.. ప్రతి ఒక్కరూ తిలకించేలా నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి రామయ్య కళ్యాణం తిలకించే అదృష్టం భక్తులకు దక్కదు. కారణం కరోనా మహమ్మారి. ఇది రాష్ట్రంలో రోజు రోజుకూ ఎక్కువవుతున్న కారణంగా స్వామివారి కళ్యాణానికి ఎవరినీ అనుమతించట్లేదని.. కాబట్టి భక్తులెవరూ రావొద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
కేవలం అర్చకులు మాత్రమే శాస్త్రోక్తంగా కళ్యాణం క్రతువును నిర్వహించనున్నారు. రామయ్య కళ్యాణం బాధ్యతలను ఈసారి ప్రభుత్వ సలహాదారు రమణాచారికి అప్పగించారు. రామయ్య కల్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తీసుకుని వచ్చే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఈసారి ఎవరు తీసుకువస్తారనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కళ్యాణం టిక్కెట్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికే కొన్నవారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.