పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే
మాచర్లలో అల్లర్లు, దాడులకు టీడీపీ కుట్రలు చేసింది. పథకం ప్రకారం వైపీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. టీడీపీ ప్రచార కార్యక్రమం ఎవరైనా రాడ్లు, కర్రలు, మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారా? పార్టీ జెండాల స్థానంలో రాడ్లు పట్టుకుని టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇంచార్జ్ బ్మహ్మారెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు భయానక వాతావరణం సృష్టించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఓర్చుకోలేక టీడీపీ ప్లాఫ్ షోలు చేస్తుంటే ప్రజలు తిరగబడుతున్నారు. అందుకే ప్రచారం కోసం మాచర్లలో దాడులకు తెగబడ్డారు.
పల్నాడులో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి మధ్య సామరస్యాన్ని ధ్వంసం చేసేలా టీడీపీ చూస్తోంది. వైసీపీని ఎదుర్కోలేక టీడీపీ నాయకులు ప్రజలను దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పల్నాడులో ప్రజల నుంచి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత పట్టు కోల్పోయిన టీడీపీ దౌర్జన్యంతో దాడులు చేస్తోంది. సొంత వాహనాలకు నిప్పు పెట్టి బ్రహ్మారెడ్డి వర్గం వైసీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు, లోకేష్ కావాలనే మాచర్లకు ఫ్యాక్షన్ నేతలను పంపి గొడవలు చేశారు.
ఈ ప్రాంతంలో టీడీపీ ఫ్యాక్షన్ మూలాలతో దాడులు చేసి ప్రజల సెంటిమెంట్ దెబ్బతీయాలని, రాజకీయ ప్రయోజనాల కోసం సెంటిమెంట్లను దుర్వినియోగం చేస్తోంది. టీడీపీ అసలు రంగు ఇదేనని ప్రజలు ఇప్పటికే బాగా తెలుసుకున్నారు. ఇలాంటి దాడులతో వైసీపీ కార్యకర్తలు భయపడరు. టీడీపీ నేత బ్రహ్మానందరెడ్డి తప్పుడు ప్రచారాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కార్లు, ఇళ్లను ధ్వంసం చేయడంతోపాటు ప్రజలపై దాడికి పాల్పడేలా టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారు. ప్రజా ఆస్తులు, వాహనాలు, ఇళ్లు ధ్వంసానికి టీడీపీదే బాధ్యత. ఈ ఘటన మొత్తం కెమెరాల్లో రికార్డు అయ్యింది. దాడుల వీడియా ఆధారాలన్నీ మా వద్ద ఉన్నాయి. పోలీసులకు అందిస్తాం. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చి బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలి.