హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్ మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట స్థావరంపై మాదాపూర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. గచ్చిబౌలి కేంద్రంగా కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్టు వచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ దాడిలో 12 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. రూ.9లక్షల నగదు, 14 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చాలా కాలంగా ఇక్కడ పేకాట ఆడుతున్నట్టు పోలీసుల విచారణలోవెల్లడైనట్టు తెలిపారు.
కాకర్ల మాధవరెడ్డి అనే వ్యక్తి గచ్చిబౌలి గ్రీన్ ల్యాండ్ కాలనీలో ఓ ఫ్లాట్ ను రోజుకు రూ.6వేల చొప్పున అద్దెకు తీసుకున్నాడు. ఆ అద్దె భవనాన్ని పేకాట క్లబ్ మార్చి.. దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు వివరించారు. దీనిపై స్థానికులు ఇచ్చిన విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.
నిర్వాహకుడు మాధవరెడ్డితో పాటు.. 12 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వీరంతా రియల్టర్లు, రైతులని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఫ్లాట్ లో చాలాకాలంగా పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.