– పన్ను నొప్పి పేరుతో ఢిల్లీలో ఎంజాయ్
– రాష్ట్రాన్ని, రాష్ట్ర పాలనను గాలికి వదిలేసిన కేసీఆర్
– ధర్నాల పేరుతో రోడ్ల మీద డ్రామాలు
– టీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలి
– విరుచుకుపడ్డ మధుయాష్కీ గౌడ్
రైతుల సమస్యలు పరిష్కరించకుండా పన్నునొప్పి పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. అవినీతి సొమ్ములకు వచ్చే పన్నుల నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో సేదతీరుతున్నారని సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ది పన్ను నొప్పి కాదు.. ఆయనకొచ్చింది పన్నుల నొప్పి మాత్రమేనని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు సిగ్గులేకుండా జాతీయ రహదారులను దిగ్బంధిస్తూ ప్రజలను, ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విరుచుకుపడ్డారు.
రాష్ట్ర ప్రజలను, పాలనను గాలికి వదిలేసి.. సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీలో పండుకుంటారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ లు సమస్యలను పరిష్కరించాలి కానీ.. వాళ్లే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోతే.. మరి సమస్యలను ఎవడు పరిష్కరించాలని ప్రశ్నించారు మధుయాష్కీ గౌడ్. పరిష్కరించాల్సినోళ్లే ధర్నాల పేరుతో రోడ్ల మీద డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.
పెంచి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని.. ప్రజల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లలో ఏనాడైనా ఇంధన ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ ను తగ్గించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించి ప్రజలకు ఊరటనిస్తున్నాయని గుర్తుచేశారు మధుయాష్కీ.