పిల్లలు,దేవుడు సమానం అంటారు. అలాంటి పిల్లలకు రాకూడని కష్టం వచ్చింది. ఈ సమస్యను వాళ్లే పరిష్కరించుకోవాలనుకున్నారు. అందుకే ఆ ఇద్దరు చిన్నారులూ నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చారు.
‘అంకుల్.. అమ్మను కాపాడండి..నాన్నను అరెస్టు చేయండి’ అంటూ పోలీసులను కోరారు. ఈ తమాషా అయిన సంఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా భిటర్వార్ పోలీస్ స్టేషన్ లో జరిగిందీ ఘటన.
స్టేషన్ లోకి ఇద్దరు అక్కాచెళ్లెళ్లు రావడం, చిన్న పిల్లలైన వారి వెంట ఎవరూ లేకపోవడంతో ఆశ్చర్యపోయిన పోలీసులు.. దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టారు. పిల్లల నుంచి వివరాలు ఆరా తీశారు. ‘‘మీరేమీ భయపడాల్సిన పని లేదు.. సమస్య ఏంటో చెప్పండి’’ అని స్టేషన్ ఇన్ చార్జ్ ప్రదీప్ శర్మ అడిగారు.
‘‘అమ్మను నాన్న కొడుతున్నాడు.. నాన్నను అరెస్టు చేయండి’’ అంటూ పిల్లలు కోరారు. వారు చెప్పిందంతా విన్న ప్రదీప్ శర్మ.. నేరుగా వారి ఇంటికి వెళ్లారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
భార్యభర్తలు గొడవ పడుతూ ఉంటే, పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని చెప్పారు. తండ్రికి కూడా వార్నింగ్ ఇచ్చారు. కాగా.. స్టేషన్ లో ఆఫీసర్ ఎదుట పిల్లలు కూర్చున్న ఫొటో వైరల్ అవుతోంది.
పెద్దమ్మాయి స్టేషన్ ఇన్ చార్జ్ ఎదురుగా కూర్చుని మాట్లాడుతుండగా, చిన్నమ్మాయి దీనంగా కూర్చుని ఉంది. ఏమాత్రం భయపడకుండా స్టేషన్ దాకా వెళ్లిన పిల్లల ధైర్యాన్ని పోలీసులు సహా అందరూ మెచ్చుకుంటున్నారు.