ఏలూరు జిల్లా నూజివీడులో ఏకంగా కాలేజీ బస్సులోనే క్షుద్రపూజలు చేయడం కలకలం సృష్టిస్తోంది. విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. బస్సు ఎక్కాలంటేనే జంకుతున్నారు. అయితే నిజంగానే క్షుద్ర పూజలు జరిగాయా.. లేక ఎవరైనా ఆకతాయిలు కావాలని ఆట పట్టించడానికి ఇదంతా చేశారా.. అన్నది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఇక డీటైల్స్ లోకి వెళితే.. చాట్రాయి మండలం కృష్ణా రావుపాలెం గ్రామంలో వికాస్ కాలేజీ బస్సులో అర్థరాత్రి వేళ క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్థానిక ఆంజనేయ స్వామి గుడి వద్ద పార్కింగ్ చేసి ఉన్న కాలేజీ బస్సులో అర్థారాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
బస్సులో ఓ పటం వేసి.. దాని పై నిమ్మకాయలు, అన్నం ముద్దలు పెట్టి క్షుద్ర పూజలు చేశారు. బస్సు మధ్యలో ముగ్గులు నిమ్మకాయలు ఉంచి పూజలు చేయడమే కాకుండా.. బస్సు లోపల డ్రైవర్ వెనుకాల ఉండే బోడుకు నిమ్మకాయల దండ, మరికొన్ని ఆకులు గుచ్చి దండగా వేసి పూజలు చేసినట్టు కనిపిస్తోంది. బస్సు లోపలి నుంచి టాప్ భాగంతో పాటు.. ఇరు వైపుల ఉంటే అద్దాలకు కూడా హస్తం ముద్రలు కనిపిస్తున్నాయి.
ఈ పూజలు చేసిన ఆనవాళ్లు చూసి భయాందోళనలో విద్యార్థులు ఉండగా..మరో బస్సులో విద్యార్థులను కాలేజీకి తరలించింది సదరు కాలేజీ యాజమాన్యం. ఓ వైపు ప్రేమికుల రోజు జరుగుతుండగా.. ఇవాళే ఈ పూజలకు పూనుకున్నారంటే.. ఎవరైనా అమ్మాయిల కోసం పూజలు చేసి ఉంటారా.. లేదా కాలేజీ యాజమాన్యం అంటే గిట్టని వాళ్లు చేసిన పనా.. ఆకతాయిలే ఇలా విద్యార్థులను భయపెట్టడానికి చేశారా.. అనేది తేలాల్సి ఉంది.