తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ మహేశ్ బ్యాంక్ సైబర్ దోపిడీ కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతిని సాధించారు. ఈ మేరకు సర్వర్ను హ్యాక్ చేసి 12 కోట్లు ఇతర ఖాతాలకు మళ్లించిన ఘటనలో ప్రధాన సూత్రధారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇప్పటికే ఈ కేసులో 20 మందిని అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసు దర్యాప్తుకు ఇతర కేసుల కంటే ఎక్కువ ఖర్చయిందని స్వయంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇటీవల ప్రకటించారు.
హైదరాబాద్ కేంద్రంగా సైబర్ దోపిడీ చేయాలని పథకం రచించిన ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్ చక్స్.. హ్యాకర్ల ఆదేశాల మేరకు రూ.12.48 కోట్లు కాజేసేందుకు ప్లాన్ రెడీ చేశాడు. ఇందుకోసం ఇద్దరు నైజీరియన్లు స్టీఫెన్ ఓర్జీ, సీ ఆప్టిల్కు బాధ్యతలు అప్పగించాడు. ప్లాన్ ప్రకారం అంతా సిద్ధమయ్యాక ఈ ఏడాది జనవరి 22, 23 తేదీల్లో స్టీఫెన్ ఓర్జీ, ఆప్టిల్ ద్వారా రూ.12.48 కోట్లు బదిలీ చేయించాడు. ఆ తర్వాత చక్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
స్టీఫెన్ ఓర్జీని నాలుగు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. మహేశ్ బ్యాంకు నుంచి డబ్బులు కొట్టేసే ప్లాన్ ఎవరు వేశారు.. అతడి వెనక ఉన్నది ఎవరన్న విషయాన్ని విచారణలో ఓర్జీ వెల్లడించాడు. సైబర్ దోపిడీ కోసం మహేశ్ బ్యాంకులో ఖాతా తెరిచే బాధ్యతను చక్స్.. తనకు పరిచయం ఉన్న ఢిల్లీకి చెందిన అక్తర్కు అప్పగించానని చెప్పుకొచ్చాడు.
ఇందులో భాగంగా బియ్యం వ్యాపారం నిమిత్తం ఢిల్లీకి వచ్చే కర్నూలు వాసి రసూల్తో.. అక్తర్ నాలుగు నెలల క్రితం మాట్లాడి మహేశ్ బ్యాంకులో ఖాతా తెరిస్తే కమీషన్ ఇస్తామని ఆశ చూపాడు. ఈ మేరకు డిసెంబరులో రసూల్ తన స్నేహితుడైన కూకట్పల్లిలో ఉంటున్న కోలిశెట్టి సంపత్ కుమార్తో కలిసి మహేశ్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాడు.
జనవరి 22న రాత్రి సంపత్, రసూల్ కలిసి హైదరాబాద్లో స్టీఫెన్ ఓర్జీ, ఆప్టిల్ను కలుసుకున్నారు. ఆ తర్వాత ల్యాప్టాప్ ద్వారా కారులోనే మహేశ్ బ్యాంకులోని సంపత్ ఖాతాకు రూ.99 లక్షలను ఓర్జీ బదిలీ చేశాడు. మరో బ్యాంకులో సంపత్ ఖాతాకు కమీషన్ కింద రూ. 5 లక్షలు బదిలీ చేశాడు.
అలాగే, ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రైవేటు ఉద్యోగి అలెక్స్ పాండీని లైన్లో పెట్టిన చక్స్.. అతడి ద్వారా హైదరాబాద్లో శాన్విక ఎంటర్ప్రైజెస్ నిర్వహిస్తున్న మేడారపు నవీన్తో మహేశ్ బ్యాంకులో ఖాతా తెరిపించాడు. జనవరి 22, 23 తేదీల్లో రూ.4 కోట్లను నవీన్ ఖాతాకు బదిలీ చేశాడు. అనంతరం ఆ ఖాతా నుంచి ఢిల్లీ యూపీ, ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాలకు ఆ సొమ్మును బదిలీ చేశాడు. అయితే, కొన్ని లావాదేవీలు ఫెయిల్ కావడంతో కొంత సొమ్ము కేటుగాళ్ళకు అందకుండా పోయింది. ప్రధాన నిందితుడు దొరకడంతో కేసులో మరిన్ని అంశాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.
జనవరి 23వ తేదీన మహేష్ బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసిన నిందితుడు పన్నెండు కోట్ల రూపాయలను.. నాలుగు ఖాతాల్లోకి మళ్లించాడు. ఆ తర్వాత అప్పటికే సిద్ధం చేసుకున్న మరో 128 ఖాతాలకు 12 కోట్లు మళ్లించాడు. సర్వర్లో నుంచి నగదు అక్రమంగా బదిలీ అయిన విషయం గమనించిన మహేష్ బ్యాంకు ప్రతినిధులు.. అప్రమత్తమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు బదిలీ అయిన విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సదరు బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లడంతో మూడు కోట్ల రూపాయలను బదిలీ కాకుండా నిలిపి వేయగలిగారు. 9 కోట్ల రూపాయలు మాత్రం సైబర్ నేరగాళ్లు పలు ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకున్నారు.