రాష్ట్రంలో ఇటీవల మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లలో నిర్వహించిన ఐటీ సోదాలు సంచలనం రేపాయి. తనిఖీల సమయంలో పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో మంత్రి మల్లారెడ్డి పాటు మరో 16 మందిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు.
ఈ రోజు మల్లారెడ్డి ఐటీ దర్యాప్తులో మొదటి రోజు విచారణ ముగిసింది. ఈ రోజు మంత్రి మల్లా రెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం మల్లా రెడ్డి కుమారుడు మీడియాతో మాట్లాడారు.
ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాము సమాధానాలు ఇచ్చామన్నారు. తనతోపాటు కళాశాలల ప్రిన్సిపాల్ మరికొంత మా సిబ్బందిని అధికారులు విచారించారని చెప్పారు. తమతో పాటు తమ కళాశాల సిబ్బంది స్టేట్మెంట్లను అధికారులు రికార్డు చేశారని చెప్పారు.
అవసరమనుకుంటే మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారు. ఇంజినీరింగ్ ,మెడికల్ కళాశాలల ఫీజుల వివరాలు సీట్ల కేటాయింపు వివరాలను సమర్పించాలని అధికారులు కోరారని వెల్లడించారు. ఐటి అధికారులు ఇచ్చిన ఫార్మేట్ లోనే వివరాలు ఇవ్వాలని కోరారన్నారు.
అధికారులు అడిగిన ఫార్మట్లోనే పూర్తి వివరాలు ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామన్నారు. తాము చెప్పిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందారని అనుకుంటున్నట్టు వివరించారు. ప్రవీణ్ రెడ్డి, మల్లారెడ్డి మహేందర్ రెడ్డికి ఇంకా సమన్లు రాలేదన్నారు.
ఐటీ అధికారుల విచారణకు తాము అన్ని విధాల సహకరిస్తామన్నారు. ఈ రోజు మరో పదిమందికి ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ రోజు విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా వారికి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 5 వరకూ పలువురిని ఐటీ అధికారులు విచారించనున్నారు. రేపు మంత్రి మల్లారెడ్డి తరుఫున ఆయన ఆడిటర్ విచారణకు హాజరు కానున్నారు.