జొరాల దవాఖానా తెలంగాణ!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో దున్నపోతు ప్రభుత్వం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే సీతక్క, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి భట్టి పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. మలుగు ఏరియా ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం కల్పించలేదని దుయ్యబట్టారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి అంటే 250 పడకలు ఉండాలని, ఇక్కడ కేవలం వంద పడకలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన లేదు అని చెప్పడానికి ఇంతకంటే ఏమి కావాలి అన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించలేదని అన్నారు.
వసతులు ఎక్కడ
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో ఇక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తే, ఇప్పటివరకు ఎక్విప్మెంట్ ఆరేళ్లలో సమకూర్చలేదని మల్లు మండిపడ్డారు. ఎంఆర్ఐ, ఈసీజీ లేదని అన్నారు. బ్లడ్ సేపరేటర్, డయాలసిస్ సెంటర్ కూడా లేదని వివరించారు.
డాక్టర్లు ఎక్కడ?
ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పదిమంది సివిల్ సర్జన్లు ఉండాలని, ఇక్కడ ఒక్కరూ లేరని మల్లు చెప్పారు. ఏడుగురు డిప్యూటీ సివిల్ సర్జన్లు ఉండాల్సిన ఆసుపత్రిలో ఎవరూ లేరని చెప్పారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 27 మంది ఉండాల్సి ఉంటే 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు.