తలపెట్టిన పనిలో శుభం జరగాలని..దేవతలారా దీవించండని కోరుకుంటాం. కానీ హరియాణాకు చెందిన ఓ వ్యక్తి దీనికి విరుద్ధంగా మన దేశప్రముకుల్ని దీవించమని ఆహ్వానిస్తున్నాడు. ఎందుకో తెలిస్తే వాళ్ళకన్నా ముందు మీరు షాకవుతారు.!
మరేం లేదు.. తన ఆత్మాహుతి కి భారతదేశ ప్రముఖులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్లను ఆహ్వానిస్తున్నాడు. “ఓరి వీడి అఘాయిత్యం కూల…!”అనిపించింది కదూ..!
పాపం ఎంత కష్టమొచ్చిందో ఏంటో..? వస్తే మాత్రం. పెళ్ళికి పిలిచినట్టు ఆత్మహత్యకు ఆహ్వానించడం ఏంటి..!? అదవేంటో తెలుసుకుందాం. బిహార్లోని పట్నాకు చెందిన సంజీవ్ అనే వ్యక్తి.. హరియాణాలోని ఫరీదాబాద్ వీధుల్లో “నా కిడ్నీ అమ్మకానికి సిద్ధంగా ఉంది. మార్చి 21న ఆత్మాహుతి కార్యక్రమం” అని రాసిన బ్యానర్ పట్టుకుని తిరిగుతున్నాడు.
సంజీవ్ ప్రస్తుతం ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్నాడు. సంజీవ్కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి సంజీవ్కు జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. పెళ్లైన తర్వాత సంజీవ్కు తన భార్య, బావమరిది, అత్తమామల నుంచి వేధింపులు ఎదురయ్యాయి.
కుటుంబంపై వరకట్నం కేసు పెడతామని బెదిరింపులకు గురి చేశారు. కాగా సంజీవ్ భార్య 4 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లగా.. అక్కడివారు ఆమెకు అబార్షన్ చేయించారు.
అప్పటినుంచి అతని భార్య కాపురానికి రావడానికి నిరాకరించగా.. సంజీవ్పై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసింది. అయితే ప్రస్తుతం సంజీవ్ బెయిల్పై బయట తిరుగుతున్నాడు.
దాదాపు ఆరేళ్లుగా ఈ కేసు నడుస్తుండగా.. ఇప్పుడు భార్య తనకు విడాకులు ఇవ్వడమే కాకుండా.. భరణం కింద రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని సంజీవ్ వాపోయాడు. సాయం చేయాల్సిందిగా పోలీసులు, అధికారులను ఎన్నిసార్లు సంప్రదించినా సరే తనకు న్యాయం జరగలేదని వెల్లడించాడు.
దీంతో విసిగిపోయి ఇలా బ్యానర్తో తిరుగుతున్నానని వెల్లడించాడు. మార్చి 21లోగా కిడ్నీ విక్రయిస్తే ఆ డబ్బులు తన భార్యకు ఇస్తానని చెప్పాడు. ఒకవేళ విక్రయించలేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు.
ఈ మేరకు 21న పట్నాలో ఆమరణ నిరాహర దీక్ష, ఆత్మాహుతి కార్యక్రమం ఉంటుందని బ్యానర్పై ముద్రించాడు సంజీవ్. ఆ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమార్లు రావాలని వారి పేర్లను సైతం బ్యానర్పై ఒకవైపున ముద్రించాడు.
రెండోవైపు.. భార్య, బావమరిది, ఇతర బంధువుల ఫొటోలను ముద్రించాడు. దీంతో పాటుగా సంజీవ్ తన ఫోన్ నంబర్, ప్రస్తుతం ఉంటున్న చిరునామాను కూడా బ్యానర్పై ప్రింట్ చేశాడు.
భార్య తన దగ్గరకు రావాలని తాను కోరుకుంటున్నా సరే.. రావడానికి ఆమె సిద్ధంగా లేదని సంజీవ్ తెలిపాడు. దీంతో రోడ్లపై వెళ్లే వారు తమ వాహనాలు ఆపి మరీ.. సంజీవ్ బాధను తెలుసుకుంటున్నారు.