తల్వార్ తో 60 ఏళ్ల వ్యక్తి హల్ చల్ సృష్టించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలో చోటు చేసుకుంది. కొండ్రికర్ల గ్రామ ఆలయ స్థలం విషయంలో కొద్ది రోజులుగా కొండ్రికర్ల విలేజ్ డెవలప్ మెంట్ కమిటీకి, జిన్నా శంకర్ అనే వ్యక్తి కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతుంది. సమస్య పరిష్కారం కోసం శుక్రవారం వీడీసీ సభ్యులు సమావేశమయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శంకర్ అక్కడికి తల్వార్ తో వచ్చాడు.
తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చంపుతానని బెదిరిస్తూ హల్ చల్ చేశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శంకర్ ను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించే క్రమంలో పోలీసు వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు.
60 సంవత్సరాల క్రితం జగ్గాసాగర్ కు చెందిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆలయం కోసం ఐదు ఎకరాల భూమి దానం చేసాడని వీడీసీ సభ్యులు చెబుతున్నారు. ఆ స్థలంలో గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి, ఖాళీ స్థలాన్ని గ్రామ అవసరాలకు వినియోగించుకుంటున్నామని స్థానికులు వెల్లడించారు. అయితే ఆ స్థలాన్ని తిరిగి సుధాకర్ రెడ్డి దగ్గర కొనుగోలు చేసి శంకర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని వీడీసీ సభ్యులు చెబుతున్నారు.
కొద్ది రోజులుగా ఇదే విషయంలో శంకర్ ను, అతని బంధువులకు చెందిన 8 కుటుంబాలను వీడీసీ గ్రామ బహిష్కరణ చేశారు. ఈ ఘటనపై శంకర్ ఫిర్యాదు చేయగా, ఇప్పటికే వీడీసీ సభ్యులపై కేసులు నమోదైయ్యాయి. శంకర్ పై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా తమపైనే కేసులు పెడుతున్నారని వీడీసీ సభ్యులు ఆందోళన దిగారు. శంకర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చి అతడిని మెట్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.