నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని 9 ఏళ్ల చిన్నారిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధిత చిన్నారి కనపర్తి లోని నానమ్మ వద్ద ఉంటోంది. వీరి తల్లిదండ్రులు నెల్లూరులోని ఓ అపార్ట్మెంట్ లో స్వీపర్లుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం చిన్నారి నానమ్మ నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు కాలనీ నుంచి గ్రామంలోకి వెళ్ళింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు గడియ పెట్టాడు. అనంతరం చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సుమారు గంట సేపు చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన చిన్నారి ఏడుస్తూ గ్రామం నుంచి తిరిగి వచ్చిన నానమ్మకు తన పరిస్థితిని వివరించింది.
ఈ క్రమంలో పరార్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడు కుమార్ ను గ్రామస్తులు పట్టుకొని శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద నమోదు చేసినట్లు సీఐ జి గంగాధర్ రావు తెలిపారు. దిశ చట్టం అమల్లో ఉండగా నిర్భయ చట్టం ఎందుకు పెడుతున్నారంటూ బంధువులు ఆందోళన చేస్తున్నారు. నిందితుడిని దిశ చట్టం కింద ఉరితీయాలని బంధువులు కోరుతున్నారు.