డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడిగా ఉన్న నవీన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. నవీన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది.
బెయిల్ కోసం నవీన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఇటీవల రంగారెడ్డి జిల్లా కోర్టు తిరస్కరించింది. దీంతో నవీన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
కాగా ఈ కేసులో అనేక ట్విస్టులు బయటపడ్డాయి. హైదరాబాద్ లోని మన్నెగూడలో డిసెంబర్ 9వ తేదీన పట్టపగలు నవీన్ రెడ్డి అనే వ్యక్తి 100 మందితో వైశాలి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులను కొట్టి యువతిని కిడ్నాప్ చేశాడు. ప్రేమించిన అమ్మాయి మరొక పెళ్లికి సిద్ధపడిందని యువతి ప్రియుడు నవీన్ సినిమా లెవల్లో కిడ్నాప్ వ్యవహారాన్ని నడిపాడు.
ఈ కేసులో నిందితునిగా ఉన్న నవీన్ రెడ్డిని డిసెంబర్ 14న పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో ఉంచారు పోలీసులు. బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేసి నవీన్.. ఎట్టకేలకు రిలీఫ్ లభించింది.