గుంటూరు: తిరుమలకు 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలని వైఎస్ చెబితే, ఇప్పుడు జగన్ టీటీడీ మొత్తాన్ని తెలంగాణకు అప్పగించేలా వ్యవహరిస్తున్నారని టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, తెలుగుయువత నేత మద్దిపట్ల సూర్యప్రకాష్ ఆరోపించారు. వీరిద్దరూ కలిసి టీటీడీ పాలకమండలి నియామకాలపై నిరసన తెలియజేస్తూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాది మంది భక్తుల మనోభావాలకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యులను ఆధ్యాత్మిక భావనలు వున్నవారినే ఎంపిక చేయాల్సివుండగా, జగన్ ప్రభుత్వం ఆరోపణలు వున్న వ్యాపారవేత్తలను, జగన్ కేసులు మోస్తున్న వారిని నియమించడం ఆ క్షేత్రం పవిత్రతను కించపరచినట్టేనని విమర్శించారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని తూర్పారబట్టారు.
సత్యనారాయణరాజు, సూర్యప్రకాశ్ సంయుక్త ప్రకటన పూర్తి పాఠం ఇదీ.. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కనుసన్నల్లో ఆయన మెప్పు పొందేందుకు అనుక్షణం ఆరాటపడుతున్నారు. పవిత్రమైన టీటీడీని తెలంగాణ బోర్డులా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పక్క రాష్ట్రాల నుంచి ఇంత మందిని బోర్డు సభ్యులుగా చేయడం వెనక ఆంతర్యం ఏమిటి? దేవస్థానం నిధులు ఆయా రాష్ట్రాలకు కేటాయించమని సభ్యులు డిమాండ్ చేస్తే బోర్డు పరిస్థితి ఏంటి? జగన్ వికృతమైన చర్యలకు దేవస్థానం బోర్డు భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారు. కేసీఆర్ సూచనల మేరకే బోర్డు సభ్యుల సంఖ్యను పెంచారు. రాష్ట్రాన్ని మీరు పాలిస్తున్నారో లేక కేసీఆర్ పాలిస్తున్నారో అర్ధం కాని ఆయోమయంలో ప్రజలున్నారు. కేసీఆర్ కుటుంబంలోనే ఇద్దరితో పాటు ఆయన ఆనుచరుడు ఒకరు, వాళ్ల అబ్బాయి చెప్పారని మరోకరికి బోర్డు సభ్యులుగా అవకాశం ఇవ్వటం దేనికి సంకేతం? ఏపీకి 8 మంది, తెలంగాణకి 7 మంది, తమిళనాడుకి 4 మంది, కర్ణాటక 3 మంది, మహారాష్ట్రకి 1, ఢిల్లీకి 1 సభ్యులుగా కేటాయించారు. రాష్ట్రంలో సమర్ధులు ఎవ్వరు లేరా? స్థానికులకు 75% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి దేశవ్యాప్తంగా ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి టీటీడీలో ఎందుకు రిజర్వేషన్ అమలు చేయలేదు? 75% అంటే కనీసం 18 మంది కేవలం మన రాష్ట్రం నుంచి తీసుకోవాలి. జగన్ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం అని ప్రజలకు అర్ధం అయ్యింది. మహిళలకు పెద్ద పీట వేస్తామని ఎన్నికల ఊదరగొట్టిన జగన్ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత తిలోధకాలు పలికారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు దేవాలయాల్లో నామినేటెడ్ పోస్టుల్లో 50% కల్పిస్తామని బిల్లును టిటిడి బోర్డులో ఎందుకు అమలు చేయలేదు? టిటిడి బోర్డు సభ్యులుగా ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉన్నవారిని తీసుకోవాలి. జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యాపారస్తులను, జగన్ కేసులను ఎదుర్కొంటున్న వారిని, మద్యం వ్యాపారులకు స్థానం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, మంత్రులకు రెండు లేఖలు మించి ఎక్కువ అనుమతించుకుండా తెలంగాణ మంత్రులకు మాత్రం 10 లేఖలు ఇచ్చినా అనుమతించటం వెనక ఉన్న లోగుట్టును బయటపెట్టాలి. మాట తప్పను మడమ తిప్పనని చెప్పిన జగన్ 75% రిజర్వేషన్ను టీటీడీలో ఎందుకు అమలు చేయలేదు? అడగక ముందే స్పందించే స్వామిజీలు ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు మెదపటానికి ఎందుకు వెనకాడుతున్నారు?