ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులకు అనేక సంక్షోభాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే అనేక స్థావరాలను రష్యా అక్రమించుకుంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్, అమెరికాలపై రష్యా సంచలన ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ లో జీవాయుధాలు తయారు చేస్తున్నారని రష్యా పేర్కొంది. ఆ దేశాన్ని డీ నాజిఫై చేయాలని మాత్రమే కోరుకుంటున్నామని వెల్లడించారు. ఉక్రెయిన్ వల్లే అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
కీవ్ అధికారులు ప్రజల తరలింపు ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని జఖరోవా అన్నారు. మానవతా కారిడార్ ల సమాచారాన్ని కావాలనే ప్రజలకు తెలియనివ్వడం లేదని ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాము ప్రయత్నించడం లేదని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా పేర్కొన్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన మూడు దశల చర్చల్లో కొంత పురోగతి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో అమెరికా.. ఉక్రెయిన్ లో బయోవెపన్ లను అభివృద్ధి చేస్తున్నట్లు మాస్కో వద్ద డాక్యుమెంటల్ ఆధారాలు ఉన్నాయన్నారు. బయలాజికల్ రీసెర్చ్ కోసం ప్రయోగశాలలు ఉక్రెయిన్ లో ఉన్నాయని నూలాండ్ ధ్రువీకరించారని ఆమె చెప్పారు. తాము ఇక్కడ శాంతియుత ఉపయోగాలు, శాస్త్రీయ లక్ష్యాల గురించి మాట్లాడటం లేదు అని జఖారోవా అన్నారు.
ఈ కార్యక్రమాలకు అమెరికా రక్షణ శాఖ నిధులను సమకూర్చుతోందని ఆరోపించారు. బయో వెపన్స్ తయారీ గురించి అమెరికా రక్షణ శాఖ, అమెరికా అధ్యక్ష పరిపాలనా యంత్రాంగం అధికారికంగా వివరించాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ సాధారణ ప్రజలపై రష్యా దాడులు చేస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని కూడా మారియా జఖరోవ్ తోసిపుచ్చారు. సామాన్యులపై దాడులు చేయడం లేదని, ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడం రష్యా సైన్యం లక్ష్యం కాదని తేల్చి చెప్పారు. కాగా.. బయోవెపన్ ల ఆరోపణలను అమెరికా, ఉక్రెయిన్ దేశాలు ఖండించాయి.