ప్రముఖ నటి జమున మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటితరం నటీమణులలో అగ్రకథానాయికగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జమున గారు మృతి చెందడం బాధాకరం. ఆవిడ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
జమున మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను కేసీఆర్ స్మరించుకున్నారు. నటిగా కళాసేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు.
ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విలక్షణమైన నటనతోపాటుగా సామాజిక అంశాలపైనా జమునకు ఆసక్తి ఎక్కువగా ఉండేదని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీలో జమునతో కలిసి పనిచేసిన సందర్భంలో ఆమెతో వ్యక్తిగత అనుబంధం ఏర్పడిందన్నారు.
కలిసిన ప్రతిసారీ ఎంతో ఆత్మీయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. ‘భారతీయత సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా నిలిచిన శ్రీమతి జమునగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.
చిరంజీవి స్పందిస్తూ.. ‘సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి.మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 27, 2023
జమున మృతి వార్త చాలా బాధ కలిగించిందని మహేష్ బాబు తెలిపారు. ఆమె ఎన్నో ఐకానిక్ పాత్రలు చేశారన్నారు. సినిమా పరిశ్రమకు ఆమె చేసిన సేవలు ఎంతో గొప్పవన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Saddened to hear about the demise of #Jamuna garu. Will fondly remember her for all her iconic roles and her immense contribution to the industry. My condolences to her family and loved ones 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) January 27, 2023
“అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నింటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195పైగా సినిమాల్లో నటించి నవరస నటనా సామర్థ్యం కనబరిచారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆరోజుల్లోనే హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందారు. నాన్నగారు అన్నట్లు కళకు, కళాకారులకు మరణం ఉండదు. ఈ రోజు జమునగారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి” అని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జమున గారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమలో అలనాటి తరానికి తను ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన జమున గారు, తెలుగు ప్రేక్షకులకు సత్యభామగా గుర్తుండిపోతారు. ఆ పౌరాణిక పాత్రకు ప్రాణం పోశారు. ప్రజా జీవితంలో లోక్ సభ సభ్యురాలిగా సేవలందించారు. జమున గారి మృతి పట్ల చింతిస్తూ వారి కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
శ్రీమతి జమున గారు ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/pndCA41A0N
— JanaSena Party (@JanaSenaParty) January 27, 2023
దాదాపు గా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహారాణి లా కొనసాగారు. ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
దాదాపు గా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహారాణి లా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు.
మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/ImmYbmBFl0
— Jr NTR (@tarak9999) January 27, 2023
మహానటి జమున ఆత్మకు శాంతి చేకూరాలని నందమూరి కల్యాణ్ రామ్ ప్రార్థించారు. ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.