వికారాబాద్ జిల్లాలో కలుషిత నీరు తాగి పలువురు ఆస్పత్రి పాలయ్యారు. వాంతులు, విరేచనాలతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అస్వస్థతకు గురైన వారికి డాక్టర్లు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. యాలాల మండలం జుంటుపల్లి, అక్కంపల్లి గ్రామాల్లో ఈ ఘటనలు వెలుగుచూశాయి.
వీరిలో కొంతమంది చిన్న పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. జుంటుపల్లి, అక్కంపల్లి గ్రామాల్లో వైద్యాధికారులు ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 40 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అసలే వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే తమ గ్రామాల్లో అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదన్నారు. దాంతో కలుషిత నీరు సరఫరా అయ్యిందని, ఆ నీరే తాగడంతో చాలామంది తీవ్ర అస్వస్థతకు గురై విరేచనాలు, వాంతులు చేసుకుంటున్నారని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు గంట గంటకు బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఏమవుతుందోనని చాలామంది ఆందోళనకు గురవుతున్నారు.