మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. బీజాపూర్ – తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా మృతి చెందినట్లు తెలుస్తోంది. తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించింది. 43 ఏళ్ల వయసు, సన్నగా ఉండే మావోయిస్టు, దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో ఉన్నాడు. అత్యధిక సంఖ్యలో పోలీసులను హతమార్చాడు మావోయిస్టు హిడ్మా. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడైన హిడ్మా.. ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి.
1996-97 మధ్య కాలంలో అతను మావోయిస్ట్ పార్టీలో చేరాడు. ఆయనకు హిద్మల్లు, సంతోష్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. హిడ్మా 7వ తరగతి వరకు చదివాడు. మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)లో కీలక నేతగా ఎదిగాడు.
అటవీ ప్రాంతంలో పోలీసులను, సీఆర్పీఎఫ్ జవాన్లను టార్గెట్ చేయడంలో హిడ్మా వ్యూహాలు సక్సెస్ అయ్యేవి. దీంతో హిడ్మాని పోలీసులు హిట్ లిస్టులో చేర్చారు. ఉర్పల్ మెట్లలో 2007లో జరిగిన దాడుల్లో 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, తాడిమెట్లలో 2011లో జరిగిన దాడిలో 76 మంది జవాన్లు, 2017లో 12 మంది జవాన్లు మృతి చెందిన ఘటనల్లో హిడ్మా కీలక పాత్ర పోషించాడు.
మావోయిస్టు పార్టీలో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి పార్టీ, రెండోది సాయుధ బలగం, మూడు ప్రజా ప్రభుత్వం. మూడు విభాగాల్లోనూ హిడ్మా పని చేశాడు. హిడ్మాపై రూ.45 లక్షల రివార్డు ఉంది. ఇతని కోసం తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలిస్తూ వచ్చారు.