మెడికో ప్రీతి మృతికి కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మావోయిస్టులు. ఈ మేరకు జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి వెంకట్ సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేశారు.
మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని చెబుతున్న ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించడంలో విఫలమవుతుందని మండిపడ్డారు. వరంగల్ లో వైద్య విద్యార్థిని ప్రీతిని సీనియర్ సైఫ్ ర్యాగింగ్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నా.. యాజమాన్యం ఆ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని వెంకట్ ఆరోపించారు.
ప్రీతి మృతిపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆఫీసుల్లో, కాలేజీల్లో మహిళలపై వేధింపులు కామన్ అయిపోయాయని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రీతికి న్యాయం చేయాలని విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే ఆమె ఆత్మహత్యకు సైఫ్ కారణం కాదని హాస్పిటల్ యాజమాన్యం బుకాయిస్తోందని అన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళలంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి వెంకట్.