ఇటీవల ప్రవేశ పెట్టిన యూనియన్ బడ్జెట్ 2023లో ల్యాబ్ లలో వజ్రాల తయారీకి కేంద్ర ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. దీంతో ఈ వజ్రాల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అంతేకాకుండా ఈ వజ్రాల ఎగుమతులు విపరీతంగా పెరుగుతున్నాయని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి ప్రాంతీయ ఛైర్మన్ వి. మంగూకియా వివరించారు.
లక్షణాలపరంగా సహజ వజ్రాలకు, ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలకు ఎలాంటి తేడా ఉండదని చెప్పారు. సహజ వజ్రాలు గనుల నుండి బయటకు తీస్తే.. ల్యాబ్లో రూపొందించే వజ్రాలు యంత్రాల ద్వారా తయారు చేస్తారు.ఇది కూడా ‘ఆత్మనిర్భర్’ పథకం కిందకు రావచ్చన్నారు.
సాధారణంగా సహజంగా తయారయ్యే వజ్రాలు అత్యంత మన్నికైనవి, ఖరీదైనవి కూడా. కానీ ల్యాబ్ లో రూపొందించే డైమండ్స్ మన్నిక సహజ వజ్రాలతో కాస్త తక్కువ. అయితే అసలు వజ్రానికున్న లక్షణాలే వీటికి కూడా ఉంటాయి.
ఈ రెండు వజ్రాలు పక్కపక్కన పెడితే అసలు వాటిని గుర్తించలేం. వీటిని కనిపెట్టాలంటే ఆత్యాధునిక పరికరాలు కావాలి. సహజ వజ్రాల నిల్వలు క్షీణిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ల్యాబ్ లో తయారు చేసే డైమండ్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.