కరోనా వైరస్ కారణంగా మాస్క్, శానిటైజర్ నిత్య జీవితంలో భాగం అయ్యాయి. అయితే, మాస్క్ ఎక్కువగా ధరిస్తే.. సమస్యలు వస్తాయని అపోహలు చాలా మందిలో ఉన్నాయి. అలాగే, శరీరంలోకి ఆక్సిజన్ ప్రవాహం తగ్గి, కార్బన్ డయాక్సైడ్ మోతాదు పెరుగుతోందంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, వీటని వైద్యులు, శాస్త్రవేత్తలు ఖండిస్తున్నారు. మాస్క్ ధరిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు.
నాణ్యమైన ఫేస్ మాస్క్ ధరించటం వల్ల ఎన్నో రకాల వైరస్, ధూళి కణాల నుంచి రక్షణ లభిస్తుందంది వైద్యుల సూచిస్తున్నారు. మాస్క్ను ధరించడం ఆరోగ్యకరమైన అలవాటుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఒక్క కరోనా వైరస్ నుంచే కాకుండా.. వైరల్ ఇన్ఫెక్షన్లు, గాలి ద్వారా వ్యాపించే టీబీ లాంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. రద్దీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.
‘మాస్క్ లు ధరించడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయని అనిపించొచ్చు. ఏ విషయంలో అయినా లాభ, నష్టాలు ఉంటాయి. మనల్ని మనం సరిగ్గా రక్షించుకుంటే, ఇతరులను కూడా రక్షించుకోవచ్చు. మాస్క్ ధరించడం వల్ల వచ్చే ప్రతికూలతల గురించి విని ఉంటారు. శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని, వినడానికి కూడా ఇబ్బందిగా ఉందని, కళ్లద్దాలపై పొగ చేరుతోందని ఇలా ఎన్నో చెబుతారు. వీటితో మేము అంగీకరిస్తాము. కానీ, కరోనా మహమ్మారి వంటి ప్రస్తుత పరిస్థితుల్లో ధరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు చూడాలి’ అని ముంబై పారెల్ గ్లోబల్ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరీష్ చాఫ్లే తెలిపారు.
అలాగే, మసీనా హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుశీల్ జైన్ కూడా ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇన్ఫెక్షన్కు కారణమయ్యే వైరస్ల వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు. ఇక మాస్కులతో ప్రతికూలతలపై డాక్టర్ సుశీల్ జైన్ మాట్లాడుతూ.. ‘తలనొప్పి, శ్వాస పరమైన సమస్యలు(వాడిన మాస్క్ ను బట్టి), ముఖ చర్మంపై మచ్చలు, చికాకు కలిగించే చర్మ వ్యాధులు వంటివి కనిపించొచ్చు. అలాగే, చిన్నారుల్లో మాస్క్ ధారణ కష్టతరం కావొచ్చు. చాలా వేడి, తేమతో కూడిన ప్రాంతాల్లో మాస్క్ ధారణ కష్టంగా అనిపించొచ్చు’ అని చెప్పారు.
ఆస్తమా ఉన్న వారు మాస్క్ ధరించడం వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుందని చెప్పడానికి ఆధారాల్లేవని అమెరికన్ అకాడమీ ఆఫ్ అలెర్జీ, ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ సైతం ప్రకటించింది. మాస్క్ ధారణ ఆక్సిజన్ శాచురేషన్పై ప్రభావం చూపించదని తాజా అధ్యయనం కూడా ఒకటి గుర్తించింది. అయితే సరైన వెంటిలేషన్ లేక, పరిసరాల్లో గాలి ప్రవాహం ధారాళంగా లేని సందర్భాల్లో మాత్రమే మాస్క్లు ధరించిన వారు అసౌకర్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపింది. ఎత్తైన ప్రదేశాలకు కాలినడకన లేదా వాహనాల్లో వెళ్లే సందర్భాల్లో శ్వాస ఆడకుంటే.. ఆ ప్రాంతం దాటే వరకు మాస్క్ను తొలగించి ఉపశమనాన్ని పొందొచ్చని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో, జన సమూహాల నడుమ సంచరించే క్రమంలో మాస్క్ వాడకం తప్పనిసరి అని తెలిపింది.