‘అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్టు’ అని ఓ సామెత. బద్దలు కొట్టడానికి కుండ కూడా కరువైన ఓ వ్యక్తి ఏకంగా కరెంటు స్తంభం ఎక్కాడు. తనకు కట్నంగా ఇస్తానన్న బంగారు ఇమీడియట్ గా ఇస్తావా చావమంటావా అంటూ అల్లాడించాడు ఓ అల్లుడు.
మెదక్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీ నగర్కు చెందిన శేఖర్ ఎలక్ట్రిషియన్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం శేఖర్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన తర్వాత తన అత్తగారు బంగారం పెట్టలేదని మనస్తాపం చెందాడు.
దీంతో కరెంటు స్తంభం ఎక్కి కిందకు దిగనని హల్చల్ చేశాడు. బంగారం పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీన్ని గమనించిన స్థానికులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కింది దింపేందుకు ప్రయత్నించారు.
చాలా సేపు వారిని ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, డీఎస్పీ, సీఐ ఘటన స్థలానికి చేరుకుని శేఖర్కు బంగారం ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో దిగివచ్చాడు. అతను క్షేమంగా కిందకు రావడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు