మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోమవారం రాత్రి అమెరికా వెళ్ళారు. ప్రస్తుతం ఆయన అయ్యప్ప మాల వేసుకున్నారు. స్వామి మాలలో అమెరికా వెళ్ళారు. మార్చి 13న ఆస్కార్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఎవరు ఎవరు విజేతలుగా నిలిచారు? అనేది ప్రపంచానికి ఆ రోజు తెలుస్తుంది. ఆ కార్యక్రమానికి సుమారు 20 రోజుల ముందు రామ్ చరణ్ అమెరికా వెళ్ళడం విశేషం.
‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ సినిమాలోని ‘నాటు నాటు…’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ట్రెండ్ చూస్తే అవార్డు మన తెలుగు పాటకు రావడం పక్కా అని చెప్పవచ్చు. ఇంతకు ముందు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో కూడా ‘నాటు నాటు…’ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం రామ్ చరణ్ అమెరికా వెళ్ళారు. అప్పుడు అక్కడి ప్రేక్షకుల నుంచి ఆయనకు విపరీతమైన స్పందన లభించింది. ‘ఆర్ఆర్ఆర్’లో ఆయన నటనకు విశేషాల్లోని తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, హాలీవుడ్ సినిమా ప్రముఖులు సైతం అభిమానులు అయ్యారు. ప్రముఖ హాలీవుడ్ దర్శక – నిర్మాత, ‘టైటానిక్’ & ‘అవతార్’ చిత్రాల సృష్టికర్త జేమ్స్ కామెరూన్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పాత్ర గురించి మాట్లాడారు.
ఇప్పుడు రామ్ చరణ్ అమెరికా వెళ్ళడంతో ఆయనను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఆయనతో ముచ్చటించడానికి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న రామ్ చరణ్, ఆ తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. కన్నడ దర్శకుడు నర్తన్ సినిమా చర్చల్లో ఉంది. శంకర్, బుచ్చిబాబు సినిమాల తర్వాత ఆ సినిమా ఉండొచ్చు.