తన జీవితంలో సెప్టెంబర్ 22 ఎంతో ప్రత్యేకమైన రోజని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తన మొట్టమొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైంది ఇదే రోజని చెప్పారు. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. రామ్ చరణ్ నిర్మాత. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ వేడుకకు పవన్కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి.వినాయక్, కొరటాల శివ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో చిరంజీవి ఉద్వేగంగా మాట్లాడారు. తన జీవితంలో సెప్టెంబర్ 22 గొప్పతనాన్ని వివరించారు.
‘‘సెప్టెంబర్ 22 నా జీవితంలో ఒక అద్భుతమైన ల్యాండ్ మార్క్. 1978 సెప్టెంబర్ 22 నా మొట్టమొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైన రోజు. నా సినిమా ప్రజల ముందుకు వెళ్తుంది, నా గురించి వాళ్లు ఏమనుకుంటారు? సినిమా ఎలా ఉంటుంది? నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే మీమాంసలో ఒక మిక్సిడ్ ఫీలింగ్ నాది. ఒక పక్క ఎక్సైట్మెంట్, మరోపక్క టెన్షన్, ఇంకోపక్క ఏదో తెలియని ఉద్విగ్నత.. ఇలా రకరకాల ఫీలింగ్స్తో నేను ఈ నేల మీద లేనంటే ఒట్టు. అలాంటి ఉద్విగ్నత, అలాంటి టెన్షన్, ఎక్సైట్మెంట్ 41 సంవత్సరాల తరవాత ఈ 2019 సెప్టెంబర్ 22న నేను ఫీలవుతున్నాను అనేది వాస్తవం’’ అని చిరంజీవి అన్నారు.