రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ మేరకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో గంటకు 30 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పింది.
ఆయా జిల్లాలకు హెచ్చరికలు కూడా చేసింది. అలాగే సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది.
గాలి విచ్చిన్నతి ఈ రోజు విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్లు ఎత్తు వద్ద కొనసాగుతున్నట్టు పేర్కొంది.