జీతాలు పెంచాలంటూ రెండు రోజుల పాటు ధర్నాకు దిగిన హైదరాబాద్ మెట్రో సిబ్బంది ఎట్టకేలకు తమ ఆందోళన విరమించారు. ఇవాళ నగరంలోని మెట్రో స్టేషన్ లు అన్నింటిలో టికెటింగ్ సిబ్బంది విధులకు హాజరయ్యారు. సిబ్బంది హాజరుతో మెట్రో కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి.
మొదటి షిఫ్ట్ లో టికెటింగ్ సిబ్బంది తమ విధులు నిర్వహిస్తున్నారు. అయితే అధికారుల షరతులకు లోబడి విధులకు హాజరైనట్లు వెల్లడించారు. ఇంక్రిమెంట్, ట్రైన్ లో వెళ్లేందుకు అనుమతిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చారని చెప్పారు. అన్ని మెట్రో స్టేషన్ లలో యథావిధిగా ఉద్యోగులు విధులకు హాజరు కావడంతో మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
రెండ్రోజులుగా ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు ఇవాళ ఊపిరిపీల్చుకున్నారు. వేతనాలు పెంచాలని,మెట్రోలో ఉచితంగా యాక్సెస్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో మంగళవారం రోజున మెట్రో టికెటింగ్ సిబ్బంది ధర్నాకు దిగారు. వీరి ధర్నాతో దిగొచ్చిన కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ కియోలిస్, ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు టికెటింట్ సిబ్బందితో చర్చలు జరిపారు.
అయితే వేతనాల పెంపునకు సంబంధించి తమకు కొంత సమయం కావాలని ఏజెన్సీలు కోరాయని చర్చల్లో పాల్గొన్న టీసీఎంవో ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఇంక్రిమెంట్,మెట్రో రైళ్లలో వెళ్లడానికి అనుమతి వంటి హామీలతో టికెటింగ్ సిబ్బంది విధులకు హాజరవుతున్నారు.