హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జీలు వేర్వేరు తీర్పులు ఇవ్వడంపట్ల మండిపడిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ … హిజాబ్ ధరించిన ముస్లిం యువతి భవిష్యత్తులో ఏదో ఒక రోజున ఈ దేశ ప్రధాని కావాలన్నదే తన కల అన్నారు. హిజాబ్ ని ముస్లింల వెనుకబాటుతనంగా కేంద్రం పరిగణిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.
ఈ దేశాభివృద్ధికి ముస్లిం మహిళలు కూడా తమ వంతు సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పారు. మా కూతుళ్లను హిజాబ్ ధరించనివ్వండి.. మీరు బికినీలు ధరించండి అని ఆయన కేంద్రాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మీరు హైదరాబాద్ వస్తే డ్రైవింగ్ లో ఎంతో నైపుణ్యం కలిగిన ముస్లిం బాలికలు కనిపిస్తారు అన్నారాయన,
కర్ణాటక ప్రభుత్వం హిజాబ్ నిషేధంపై ఎందుకు పట్టు పడుతోందో అర్థం కావడం లేదన్నారు. హిందూ, క్రైస్తవ, సిక్కు విద్యార్థులు తమ మతపరమైన డ్రెస్సులతో తరగతులకు వస్తే వారిని ఏమీ అనరని..కానీ ఓ ముస్లిం విద్యార్ధిని మాత్రం ఆపివేస్తారని ఒవైసీ ఆరోపించారు. ఇప్పటికైనా హిజాబ్ వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సరైన తీర్పునిచ్చి ముస్లిం మహిళలకు న్యాయం చేయవచ్చునని తాను ఆశిస్తున్నానని ఒవైసీ పేర్కొన్నారు.