ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలగించడానికే చర్చలకు రావాలని అంటున్నామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అపోహలు తొలగించడానికే మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. అసలు నాయకులు రాకుండా సెకండ్ స్థాయి నేతలు వచ్చి మూడు అంశాలపై మాకు లేఖ ఇచ్చారని అన్నారు.
లేఖ ఇచ్చిన వాటిపై చర్చలకు రావాలని కోరాం. వాళ్ళు మాత్రం రావడం లేదన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని మమ్మల్ని అలసత్వంగా తీసుకుంటున్నారేమోనని వాళ్ళు పిలిచే వరకూ చర్చలకు వెళ్లకూడదని అనుకున్నామన్నారు.
కొత్త పీఆర్సీ ప్రకారమే ఈ నెల జీతాలు వస్తాయని ప్రాసెస్ జరుగుతుందన్నారు. ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వందే అంటున్న సంఘాల నాయకులు ట్రెజరీ ఉద్యోగుల్ని పని చేయొద్దు అంటున్నారని అన్నారు బొత్స.
జీతాల విషయంలో ఈ ద్వంద వైఖరి ఏంటని ప్రశ్నించారు. వాళ్ళు సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఎంత మందికి అయితే అంతమందికి జీతాలు ఇచ్చుకుంటూ పోతామన్నారు. మాకు మాటలు రావా.. మాట్లాడలేకనా..? దూరం పెరుగుతుందని సహనంతో ఉన్నామని హెచ్చరించారు. దుర్భశలు ఆడిన వారికి పర్యవసానాలు తప్పకుండా ఉంటాయన్నారు. ఉద్యోగుల్ని బూచిగా చూపించాల్సిన అవసరం మాకు లేదని ఉద్యోగులు మా వాళ్లేనని అన్నారు.