టీడీపీ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో మోసం జరిగిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించారు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు. ఏపీ పరిపాలన వికేంద్రీకరణపై సోమవారం రాజమండ్రిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాద రావుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతి విషయంలో చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని మంత్రి ధర్మాన డిమాండ్ చేశారు. పునర్విభజన చట్టం ప్రకారం శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని అమలు చేసేందుకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ప్రస్తుతం ఏ రాష్ట్రం కూడా తమ రెవెన్యూల నుంచి రూ.10 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. అమరావతి రైతుల ఆవేదన కరెక్టే కావచ్చు కానీ… అంత డబ్బును అమరావతిపై పెట్టే పరిస్థితి లేదని అన్నారు ధర్మాన ప్రసాదరావు.
పాలనా రాజధానిగా విశాఖ వద్దని చంద్రబాబు చెబితే తాము ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మూడు రాజధానుల విషయంలో మంచి నిర్ణయాలను ఇస్తే స్వీకరించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు మంత్రి ధర్మాన ప్రసాద రావు.