తెలంగాణలో రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నీళ్లు, కరెంటుతో పాటు మద్దతు ధరతో కొనుగోళ్లు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం సేకరణ చేస్తున్న జిల్లా యంత్రాంగానికి మంత్రి అభినందనలు తెలిపారు. రైతులు రోడ్లపైకి రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. రాజకీయాలు పట్టించుకోకండన్నారు.
ప్రతి జిల్లా కలెక్టర్తో మాట్లాడి అక్కడ సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రైతులకు అండంగా ఉండాలని ఆయన అన్నారు. తాలు, తరుగు సమస్య ఉత్పన్నం కావద్దని సూచనలు చేశారు. అందుకోసం రైతులు ఖచ్చితంగా ఎఫ్.ఏ.క్యూ ధాన్యం తెచ్చేలా చూడాలన్నారు. ట్రాన్స్ ఫోర్ట్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ట్రాక్టర్లను సైతం వాడుకోవాలన్నారు.
రైస్ మిల్లుల వద్ద స్థలం లేకున్నా, మిల్లులు సహకరించక పోయినా వెంటనే ఇంటర్మీడియట్ గోడౌన్లలో ధాన్యం దించాలని అధికారులకు సూచించారు. గతంలో కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ధాన్యం కొనుగోళ్లు చేసినట్టు చెప్పారు.
పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లు లేవన్నారు. అందువల్ల అక్కడి ధాన్యం ఇక్కడకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే పదిరోజులు అత్యంత కీలకమన్నారు. అందువల్ల యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.