ఐదు దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కరెంట్, పెన్షన్లు, మంచినీళ్లు, సాగునీరు, సరైన విద్యను అందించలేక పోయిందని ఆరోపించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. శనివారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటనలో భాగంగా కొల్లాపూర్ లో రూ.170 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.
అనాలోచిత విధానాలతో, అస్తవ్యస్థమైన ఆలోచనలతో ఈ దేశం పట్ల, వాస్తవిక పరిస్థితుల పట్ల అవగాహన లేకుండా దేశాన్ని బీజేపీ రావణకాష్ఠంగా మార్చిందన్నారు. మాట్లాడితే విషం చిమ్మడం, విద్వేషం మాటలు మాట్లడం తప్పా ఆలోచనతో అర్థవంతమైన మాటలు, భారతదేశాన్ని నడిపించే స్థితిలో బీజేపీ లేదన్నారు. కొల్లాపూర్ పట్టణంలో భూమి కేటాయిస్తే ఆహార శుద్ధి పరిశ్రమలను తీసుకొచ్చే చర్యలు చేపడుతామని కేటీఆర్ తెలిపారు.
ఉద్యానవన పాలిటెక్నిక్ ను మంజూరు చేస్తామని.. 98 జీవో ప్రకారం లష్కర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అమరగిరిలోను ఎకో టూరిజం ప్రాజెక్ట్ తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆదేశించారు. పింఛనర్లను 29 లక్షల నుంచి 40 లక్షలకు పెంచామని పేర్కొన్నారు. గురుకులాల ద్వారా 5 లక్షల మందికి విద్య అందిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
రాహుల్ గాంధీ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండని బతిమిలాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కాలం చెల్లిన మందు లాంటిదని.. వారికి చరిత్ర మాత్రమే మిగిలిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ కు డిపాజిట్ లు గల్లంతవుతున్నాయన్నారు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ చావడానికి సిద్ధంగా ఉన్న పార్టీ అని.. అది తెలంగాణను ఉద్ధరిస్తదంటే ఎట్లా నమ్మాలని ఎద్దేవా చేశారు కేటీఆర్.