ఎంఐఎం నేతలు గొడవలు, వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా కార్పొరేటర్ గౌసుద్దీన్ పోలీసులతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. భోలక్ పూర్ పరిధిలో రాత్రి సమయాల్లోనూ షాపులు, హోటళ్లు తెరిచి ఉంచుతుండడంతో విధుల్లో ఉన్న పోలీసులు వాటిని మూసేయాలని వెళ్లగా.. ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ వారితో దురుసుగా ప్రవర్తించాడు.
రంజాన్ సమయంలో రాత్రిళ్లు కూడా షాపులు తెరిచే ఉంచుతామని పోలీసులను బెదిరించాడు గౌసుద్దీన్. ఉన్నతాధికారులు తమకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని షాపులు మూసివేయాల్సిందేనని ఖాకీలు చెప్పగా.. కార్పొరేటర్ రెచ్చిపోయాడు. మీరంతా వంద రూపాయలకు పని చేసే మనుషులు అంటూ నోరు పారేసుకున్నాడు.
గౌసుద్దీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. కార్పొరేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కుదరకపోతే బీజేపీ నేతలకు అవకాశం ఇస్తే తగిన బుద్ధి చెబుతామని అన్నారు. పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ బెదిరింపుల వీడియో మంత్రి కేటీఆర్ కంటపడింది.
Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty
No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2
— KTR (@KTRTRS) April 6, 2022
Advertisements
ఈ ఘటనపై బాగా సీరియస్ అయ్యారు కేటీఆర్. పోలీసులపైనే దౌర్జన్యానికి దిగుతారా? వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు గౌసుద్దీన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.