ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రంగా భాగ్యనగరం మారనుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం మాదాపూర్ హైటెక్స్ లో హైదరాబాద్ ఈ మోటార్ షో 2023ను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం వివిధ కంపెనీల స్టాల్స్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోటార్ షోలో దేశీయ కంపెనీలు ఈ వెహికిల్స్ ప్రదర్శించడం సంతోషంగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈవీ కంపెనీలు ముందుకొస్తున్నాయని చెప్పారు. ఇది తొలి అడుగు మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమర్ రాజా కంపెనీ ఇప్పటికే ఈవీ బ్యాటరీ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ రంగానికి చెందిన ఉత్పత్తుల తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కు అవకాశం ఏర్పడిందని చెప్పారు. ఈ షోలో సిట్రాన్ ఎలెక్ట్రిక్ కార్, క్వాంటామ్ ఈవీ బైక్, హాప్ ఈ బైక్ ను లాంచ్ చేశారు మంత్రి కేటీఆర్.