వీఎస్టీ ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఇందిరా పార్క్ వద్ద కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి పనుల వరకు చేరుకున్న మంత్రి కేటీఆర్.. స్టీల్ బ్రిడ్జ్ పురోగతిని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఎట్టి పరిస్థితులలో మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేయడానికి అదనపు బృందాలను ఏర్పాటు చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అటు కార్మికులకు, ఇటు నగర పౌరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలను కూడా తీసుకోవాలని సూచించారు.
2.8 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జి కోసం దాదాపు 440 కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. స్టీల్ బ్రిడ్జ్ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మూడు నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలలో నగర ట్రాఫిక్ పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ని తగ్గించి, ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్ పేట్ వంటి నియోజక వర్గాల ప్రజల సౌకర్యార్థం ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉందని, ఇంతటి కీలకమైన ఈ బ్రిడ్జి నిర్మాణం సత్వరంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే సాధారణ కాంక్రీట్ నిర్మాణం కాకుండా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రానున్న 3 నెలల్లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.