రైతులను సంఘంటితం చేసి.. దేశానికి అన్నదాతల శక్తిని చాటేందుకే రైతు వేదికలను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపనలు చేశారు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో రైతు వేదికను ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా 20,603 రైతు వేదికలు నిర్మాణం చేసి అన్నదాతలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందేలా రైతు వేదికలు మేలు చేస్తాయన్నారు.
రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబీమా కల్పిస్తూ అన్నదాతల కుటుంబానికి ధీమా ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.
ఓబులాపురంలో సమ్మక్క-సారలమ్మను మంత్రి కేటీఆర్ దర్శించుకున్నారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా మేడారం ఉత్సవాలకు పేరుందన్నారు. భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు కేటీఆర్.