రెండు వారాల పాటు విదేశీ పర్యటన..వివిధ దేశాల్లో 80 కి పైగా మీటింగ్స్ ..42 వేల ఉద్యోగాలు.. ఇది పదిహేను రోజుల పాటు సాగిన ఫారెన్ ట్రిప్ లో మంత్రి కేటీఆర్ సాధించిన సక్సెస్.ఇక ఇన్ డైరెక్ట్ గా కూడా వేలాది మందికి పని దొరకనున్నట్టుగా ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సాగిన మంత్రి కేటీఆర్ యూకే,అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది.
కేటీఆర్ న్యూయార్క్,లండన్, హ్యూస్టన్, వాషింగ్టన్ డీసీ, హేండర్ సన్, బోస్టన్ లలో పర్యటించారు. 80 కి పైగా వ్యాపార సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపార విస్తరణకు మెడ్ ట్రానిక్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్, స్టేట్ స్ట్రీట్, డాజోన్, లండన్ స్టాక్ ఎక్ఛేంజ్ గ్రూపు, అలియంట్, స్టెమ్ క్రూజ్, టెక్నిప్ ఎఫ్ఎంసీ, మాండీ, జాప్ కామ్ గ్రూప్ లు ముందుకొచ్చాయని కేటీఆర్ కార్యాలయం ప్రకటించింది. ఫలితంగా పలు రంగాల్లో కొత్తగా 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు ప్రకటనలో తెలిపింది.
ఇక పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ లండన్ లో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ అమెరికాలోని నెవెడాలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ నీటి వనరుల కాంగ్రెస్ సదస్సుల్లో ప్రసంగించారని మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ‘ఇంజినీరింగ్ పురోగతి, భాగస్వామ్యానికి చిహ్నం ‘గా గౌరవం లభించిందని వివరించింది.
అయితే ‘దాదాపు 30 కంపెనీలకు చెందిన ఎన్నారై సీఈవోలతో సమావేశమైన మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించారు. దాంతో నల్గొండలో సొనాటా సాఫ్ట్ వేర్, కరీంనగర్ లో 3 ఎం ఎక్లాబ్, వరంగల్ లో రైట్ సాఫ్ట్ వేర్ సంస్థలు తమ కార్యకలాపాల విస్తరణకు అంగీకరించాయి’ అని మంత్రి కేటీఆర్ ఆఫీస్ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇక బ్రిటిన్, అమెరికా పర్యటన విజయవంతం కావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటన ప్రతినిధి బృందంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీఆర్వో ఆత్మకూరి అమర్ నాథ్ రెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో శక్తి ఎం. నాగప్పన్, ఎన్నారై వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.