తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు.
ఈ ఎనిమిదేండ్ల కాలంలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిందన్నారు. తెలంగాణలోని పారిశ్రామిక ప్రాజెక్టులకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉందన్నారు. జహీరాబాద్ నిమ్జ్లో మౌలిక సదుపాయాల కల్పనకు, హైదరాబాద్ –వరంగల్ పారిశ్రామిక కారిడార్కు నిధులు కేటాయించాలని ఆయన కోరారు.
హైదరాబాద్ –విజయవాడ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పనుల కోసం నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. జడ్చర్ల పారిశ్రామిక పార్కులో ఉమ్మడి వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బ్రౌన్ ఫీల్డ్ తయారీ క్లస్టర్లు మంజూరు, అప్గ్రేడేషన్ చేయాలని అభ్యర్థించారు.
హైదరాబాద్లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఆదిలాబాద్ సీసీఐ యూనిట్ను పునరుద్ధరించాలని ఆయన సూచించారు. ఈ బడ్జెట్లో హైదరాబాద్ ఫార్మాసిటీకి నిధులు కేటాయించాలని కోరారు. చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని ఆయన సూచించారు.