రిపోర్టర్లతో వాగ్వాదానికి దిగారు తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి అనుచరులు. రిపోర్టర్లతో టీఆర్ఎస్ నేతలు, మంత్రి మల్లారెడ్డి అనుచరులు ఓవరాక్షన్ చేశారు. మునుగోడు బై ఎలక్షన్స్ లో భాగంగా ఆరెగూడ గ్రామంలో మంత్రి మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లా రెడ్డి అక్కడన్న ఓటర్లతో మాట్లాడుతున్నారు. దీంతో మంత్రి ప్రచారాన్ని మీడియా ప్రతినిధులు వీడియోలు, ఫొటోలు తీశారు.
అయితే ఓటర్లతో మాట్లాడుతుంటే మీడియా ప్రతినిధులు వీడియో తీయటంపై మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన మంత్రి అనుచరులు వీడియో తీస్తున్న రిపోర్టర్ల ఫోన్లు గుంజుకున్నారు. అంతటితో ఆగకుండా మీడియా ప్రతినిధులను తిట్టారు. అయితే మంత్రి మల్లారెడ్డి అనుచరుల ప్రవర్తనపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి మీడియాలో నిలిచారు మల్లారెడ్డి.
కాగా ఇటీవల మునుగోడులో ప్రచారం చేసిన మంత్రి మల్లారెడ్డి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు పార్టీ ఇస్తున్నారని.. ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మంత్రి మల్లారెడ్డి ముందు మద్యం గ్లాసు, ఆయన చేతిలో ఫుల్ బాటిల్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మునుగోడు ప్రచారంలో మంత్రి మద్యం తాగుతున్నారంటూ ఫొటోలు నెట్టింట హల్చల్ అయ్యాయి.
అయితే తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ విందులో చుట్టాలకు మందు పోశానని, అందులో తప్పేముందని మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. నేను బయట మాత్రమే మంత్రినని.. ఇంట్లో కాదన్నారు. మందు తాగితే తప్పేంటి? నాకు పర్సనల్ లైఫ్ ఉండదా అంటూ ఆగ్రహించారు మంత్రి మల్లారెడ్డి.