కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ పథకంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ నిరసనలపై రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. అగ్నిపథ్ అనేది ఓ అనాలోచిత నిర్ణయమని మండిపడ్డారు. పదో తరగతి పాసైన వారు అగ్నిపథ్ లో చేరి.. తిరిగి వెళ్లేటప్పుడు 12 వ తరగతి పాసైన సర్టిఫికెట్ ఇస్తామనడం దారుణమని విమర్శించారు.
అంతకు ముందు వ్యవసాయ చట్టాలతో రైతులను, ఇప్పుడు అగ్నిపథ్ వంటి నిర్ణయాలతో యువతను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనం తెస్తాం.. రూ.15 లక్షలు పేదల ఖాతాలలో వేస్తాం.. అని అమాయకుల ఓట్లు కొల్లగొట్టి అధికారం చేపట్టిన తర్వాత.. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆదాయాన్ని దోచుకు తింటున్నారని నిప్పులు చెరిగారు.
ప్రధాని మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగ శాతం 5.6 శాతం నుండి 7.83 శాతానికి పెరిగిందని ద్వజమెత్తారు మంత్రి నిరంజన్ రెడ్డి. మొత్తం ఉన్న 110 దేశాలలో.. భారత్ ఆకలి సూచిలో 101 స్థానంలో ఉండటాన్ని బట్టి చూస్తుంటే కేంద్ర పాలన ఎలా ఉందో అర్థమవుతోందని విమర్శలు గుప్పించారు. దేశంలో మోడీ సాగిస్తున్న మోసాల పాలనకు వ్యతిరేకంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు సాగుతున్నాయన్నారు.
యువత ఆగ్రహాన్ని గమనించి కేంద్రం తన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని సూచించారు మంత్రి. దేశభద్రత అనేది షార్ట్ టర్మ్ కోర్సు కాదని.. దేశ భవిష్యత్ కు, రక్షణకు దోహదకారి అని హితవుపలికారు. వేతనాలు, ఫించన్ల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్రం తలాతోకాలేని నిర్ణయం తీసుకంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో నిరసన తెలుపుతున్న యువతపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జరిపిన కాల్పులలో ఒకరు మరణించడం కేంద్రం పాలనకు అద్దం పట్టినట్టు ఉందని విరుచుకుపడ్డారు నిరంజన్ రెడ్డి.