మా చిలుక తప్పిపోయింది. దానిని పట్టి తెచ్చి ఇచ్చిన వాళ్లకు మంచి బహుమతి కూడా ఇస్తామంటూ ప్రకటించింది ఓ కుటుంబం. పగలు రాత్రి అనే తేడా లేకుండా రోజులు తరబడి గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో చిలుక ఆచూకీ చెబితే రూ.50 వేలు ఇస్తామంటూ పోస్టర్లు కూడా అతికించింది.
ఇన్ని రోజులకు వారి ఎదురు చూపులు ఫలించాయి. ఆ చిలుక వారి ఇంటికి చేరింది. తామెంతో ఇష్టంగా పెంచుకునే చిలుకను తెచ్చి ఇచ్చిన వ్యక్తికి ఆ కుటుంబం రూ.50 వేలకు బదులు.. రూ.85 వేల నజరానా ఇచ్చింది
వివరాల్లోకి వెళ్తే.. తుమకూరు పట్టణానికి చెందిన అర్జున్ అనే వ్యాపారి కుటుంబం గత రెండున్నరేళ్లుగా రెండు చిలుకలను పెంచుకుంటోంది. వాటిల్లో నుంచి ఓ చిలుక జులై 16 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆ కుటుంబం వేదనకు గురైంది. దాని ఆచూకీ కోసం వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో చిలుక జాడ చెప్పిన వారికి రూ.50 వేలు నజరానా ఇస్తామని ప్రకటించింది. తుమకూరు పట్టణంలో పోస్టర్లను సైతం అతికించారు.
లక్కీగా ఆ చిలుక మరుసటి రోజు శ్రీనివాస్ అనే వ్యక్తికి కనిపించింది. అర్జున్ ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో నీరసించిపోయిన స్థితిలో శ్రీనివాస్కు చిలుక కనిపించింది. దాన్ని ఇంటికి తీసుకుని వెళ్లి సపర్యలు చేయడంతో అది కోలుకుంది. ఈలోగా చిలుక ఆచూకీ కోసం అర్జున్ కుటుంబం వెతుకుతోందనే విషయం అతడికి తెలిసింది.
శుక్రవారం సాయంత్రం రుస్తుంను తీసుకొని అర్జున్ ఇంటికి వెళ్లాడు. శ్రీనివాస్ చిలుకను తెచ్చి ఇవ్వగానే ఆ కుటుంబం ఆనందాని అవధుల్లేకుండా పోయాయి. శ్రీనివాస్ చెప్పిందంతా విన్న వారు.. అతడికి రూ.50 వేలు ఇచ్చి సరిపెట్టకుండా.. రూ.85 వేలు నజరానా ఇచ్చారు.
అర్జున్ దంపతులు కుమారుణ్ని కోల్పోయారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి వారు చిలుకలను పెంచుకుంటున్నారు. చిలుకలు వచ్చినప్పటి నుంచి వారు కొడుకును పోగొట్టుకున్న బాధ నుంచి బయటపడ్డారు. వాటిలో నుంచి ఒక చిలుక తప్పిపోవడం వారికి ఎంతో బాధను మిగిల్చింది. దాని ఆచూకీ కోసం అర్జున్ కుటుంబం లక్షన్నర రూపాయలు ఖర్చుపెట్టారు. ఇన్ని రోజులు ముభావంగా ఉన్న ఆడ చిలుక రిస్తా.. తన జోడీ రావడంతో.. ఇప్పుడు మళ్లీ హుషారైంది.